Wednesday, February 8, 2017

ఉలవచారు బిరియాని (horsegram biryani)



 ఉదయము బిరియాని చేసుకోవాలంటే రాత్రి ఉలవలు నానబెట్టాలి.అరకిలో రైస్ కి 50గ్రా"ఉలవలు నానబెట్టాలి. నానిన ఉలవలను మెత్తగా ఉడికించాలి. చలార్చి గరం మసాలా మిరియాలు కొద్దిగా కలిపి ఉడికించిన నీళ్ళతోనే మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఈ ఉలవచారుని పక్కన ఉంచుకోవాలి.

ఉలవచారు బిరియానికి కావలసినవి:-
 బాస్మతి రైస్ - అరకిలొ
 కారెట్     -1
బీన్స్      - 6
పచ్చిమిర్చి - 8
కొత్తిమిర - ఒక కట్ట
పుదీన - ఒక కట్ట
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
నెయ్యి - తగినంత..నూనె - తగినంత

బిర్యాని ఆకు..బిర్యాని మసాలా పౌడర్+సాల్ట్
 బాస్మతి రైస్ కూడా కడిగి రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోవాలి.
 చేయు విధానం:-
 కారెట్, బీన్స్, ఉల్లిపాయ,పచ్చిమిర్చి, కొత్తిమిర, పుదీనా అన్నీ కడిగి సన్నగా తరుగుకోవాలి..కావలసినవారు బఠాణీ కూడా వేసుకోవచ్చును. కుక్కరులో నూనె, నెయ్యి వేసి కాగాక బిరియాని ఆకు, గరం మసాలా, బిర్యాని మసాలాపౌడర్ వేసి తరిగిన కూరగాయలు వేసి వేయించాలి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. తదుపరి. ఉలవచారు వేసి కలపాలి. నానబెట్టిన రైస్..ఆ నీళ్ళు పోసి బాగా కలపాలి. ఉడుకు రాగానే నిమ్మరసం ఒక చెక్క పిండి కలిపి మూత పెట్టాలి. ఒక విజిల్ రాగానే దించాలి. వేడి వేడి ఘుమఘుమలాడే ఉలవచారు బిర్యాని రైతాతో ఆరగించి చూడండి...







Tuesday, August 9, 2016

meal maker curry-- సోయా చంక్స్ కూర

సోయా చంక్స్ కూర చేయు విధానం:-

ముందుగా నీళ్ళు మరుగుతుండగా కొద్దిగా ఉప్పు,ఒక కప్పు మీల్ మేకర్స్ ను ఆ నీళ్ళలో వేసి..ఐదు ని"లు ఉంచి...ఆ నీరు వంపి,చల్లటి నీరు పోసి ..సోయాలను గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి.



కావలసినవి:-

ఉల్లిపాయలు - 2

టమోటాలు - 2

ఉప్పు  - తగినంత..

కారం  -  2 టే స్పూనులు

గరం మసాలా - 1 టీ స్పూను

ధనియా పౌడరు - 1 టీ స్పూను

అల్లం,వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు

పుదీనా,కొత్తిమీర - తగినంత

గసగసాలు పేస్టు - 2 టేబుల్ స్పూన్లు

కొబ్బరి, యాలకులు, లవంగ చెక్క పొడి..2 స్పూన్స్

ఆయిల్ - 4టేబుల్ స్పూన్లు





 చేయు విధానము : - 

కుక్కరులో ఆయిల్ వేడి చేసి, తరిగి ఉంచుకొన్న ఉల్లి,టమోటా ముక్కలను వేసి వేయించి, పుదీనా,కొత్తిమీర వేసి, అల్లం,వెల్లుల్లి పేస్టు వేసి వేయించి,ఉప్పు,కారం వేసి...పక్కన పెట్టిన సోయాలను వేసి బాగా కలిపి, మిగిలిన మిశ్రమాలను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి...ఒక గ్లాసు నీళ్ళు పోసి కుక్కరు మూత పెట్టి ..4 విజిల్స్ రానిచ్చి దించాలి..కొత్తిమీర గార్నిష్ చేసుకొని.....రోటీలలో కానీ,వేడి,వేడి రైస్ లో కానీ ఈ కూర చాలా బాగుంటుంది...ట్రై ఇట్...





Monday, October 12, 2015

కంద బచ్చలి కూర (kanda bachali curry)

కంద బచ్చలి కూర ఆవ పెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది.ఎలా ఉంటుందో నా రుచిలో చూద్దాం...








 కావలసినవి:-

తెల్ల కంద - పావు కిలో

బచ్చలి    - రెండు కట్టలు

పచ్చిమిర్చి  - నాలుగు

అల్లం       - చిన్నముక్క

కొత్తిమిర   - ఒక కట్ట

కరివేపాకు - ఒక రెబ్బ

ఆవపొడి   - అరస్పూను

కారం     -పావుస్పూను

ఉప్పు     - తగినంత

నూనె    -  3 టేబుల్ స్పూన్లు

ఇంగువ   - పావు స్పూను

చింతపండు గుజ్జు - ఒక స్పూను

ఆవాలు +మినప్పప్పు+జీలకర్ర+సెనగపప్పు+జీడిపప్పు+ఎండుమిర్చి+ఇంగువ+కరివేపాకు+పసుపు ఇవి పోపు సామాన్లు.

 చేయు విధము: ----

 కంద తొక్క తీసి,నీళ్ళలో ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి. బచ్చలి కడిగి సన్నగా తరగాలి. రెండూ కలిపి ఒక చిన్నగ్లాసు నీళ్ళు పోసి ఉడికించాలి.

 అల్లం కొత్తిమిర,పచ్చిమిర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవపొడిలో,కారం,కొద్దిగా నూనె,నీరు కలిపి ఒకపక్కన ఉంచాలి.

బాండీ లో నూనె వేసి కాగాక పైనచెప్పిన పోపు సామాను ఒకటొకటిగావేసి, వేయించి,అందులో అల్లం వగైరా పేస్ట్ వేసి,ఉడికించి ఉంచుకున్న కందబచ్చలి ఒకసారి మెదిపి పోపులో వేయాలి. ఉప్పు వేసి బాగా కలిపి చింతపండు గుజ్జు వేసి కలిపి ఒక ఐదు ని"లు మగ్గనిచ్చి, దించేముందు కలిపి ఉంచుకున్న ఆవ అందులో వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి. ఆవ ఘుమ,ఘుమలతో కంద బచ్చలి కూర రెడీ!



Friday, October 9, 2015

ఉలవచారు (horse gram)



 ఔషధ గుణాలు కలిగిన "ఉలవచారు" మరియు "ఉలవల మొలకలు".వీటి వల్ల ఉపయోగాలు,తయారుచేయు విధానము:-   



  ఉలవలను ఒక తెల్ల వస్త్రములో మూటకట్టి 6 లేక 8 గంటలు నీళ్ళలో నానబేట్టి 8 గంటల తరువాత మూతబెట్టి ఉంచాలి అవి మూడు రోజులకు మొలకలెత్తగానే   తీసుకొని అవి రోజుకి ఒక టేబుల్ స్ఫూన్ చొ"న నమిలి తింటే మంచిది. మధుమేహం,షుగరు ఉన్నవారికి పచ్చి మొలకెత్తిన ఉలవలు చాలా మేలు చేస్తాయి. త్వరగా ఆరోగ్యవంతులు కావడానికి సహాయపడతాయి. ' మెనుస్ట్రువల్ ' ప్రాబ్లంస్ కుడా కంట్రోల్ చేస్తాయి.కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తాయి. ఉలవలు బాగా వేడి చేస్తుంది అనుకునే వారు వీటితోపాటు ఒక స్పూను మొలకెత్తిన పెసలను   తినాలి.మధుమేహం(diabetic)&   ఒబేసిటీ పేషేంట్లకు -ఇది చక్కటి మందులా పని చేస్తుంది.

  ఇప్పుడు ఉలవచారు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము.




   కావలసిన పదార్ధాలు :-

 ఉలవలు          -        అర కప్పు
 చింతపండు గుజ్జు -       2,3 టీ స్పూన్లు
 మిరియాలు        -       1 స్పూను
 జీలకర్ర              -       1 స్పూను

 ఆవాలు          -       అర స్పూను
 కరివేపాకు      -       ఒక రెబ్బ
 కొత్తిమిర        -       ఒక కట్ట
  ఉప్పు            -       తగినంత
  నూనె            -       2 టీ స్పూన్లు


   ఉలవలను ముందురోజు రాత్రి నీళ్ళళో నానబెట్టి ఉదయము కుక్కరులో మెత్తగా ఉడకబెట్టాలి.ఉడికించిన నీళ్ళను తీసి ఒక పక్కగా పెట్టాలి. ఈ నీళ్ళు చాక్లెట్ రంగులో ఉంటాయి. ఉడికిన ఉలవలను గరిటతో మెత్తగా రుబ్బాలి. 
మిరియాలు,జీలకర్ర,ఆవాలు దోరగా వేయించి, చల్లారాక మెత్తగా పొడి చేయాలి. 

బాండీలో నూనె వేసి కాగాక కరివేపాకు వేసి వేయించి,చింతపండు గుజ్జువేసి కలుపుతూ, ఉలవలు ఉడికించిన నీళ్ళను అందులో వేసి కలపాలి. మెత్తగా పౌడరు చేసుకున్న మిరియాలు+ఆవాలు+జీలకర్ర పొడిని వేసి కలపాలి. మెత్తగా చేసుకున్న ఉలవ ముద్దను కూడా వేసి బగాకలపాలి. తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీరు పోసి స్టౌవ్ సిం లో పెట్టి గ్రేవీని మరీ చిక్కగా కాకుండా జారుగా ఉండేటట్లు ఉడికించి, స్టౌవ్ ఆపెయ్యాలి. గ్రేవీపైన సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమిరను జల్లాలి. చక్కటి ఆరోగ్యాన్నిచ్చే ఉలవచారు రెడీ! దీనిని వేడి,వేడి అన్నంలో,మరియు చపాతీలలో వేసుకొని తినవచ్చు. 

Thursday, August 6, 2015

కందిపొడి ( red gram powder)

 వేడి,వేడి అన్నంలో కందిపొడి,పప్పునూనె ఒక స్పూను వేసుకొని కలుపుకు తింటే ! ఆహా ఏమి రుచి . కందిపొడి నేను చేసే విధానం  ... ఇలా...

కావలసినవి:

కందిపప్పు - ఒక గ్లాసు

శనగపప్పు - అర గ్లాసు

మినప్పప్పు - పావు గ్లాసు


పెసరపప్పు - అర గ్లాసు

జీలకర్ర - రెండు స్పూన్లు

ఉప్పు  -  ఒక స్పూను

కారం -- ఒకటిన్నర స్పూను

పసుపు -  పావు స్పూను

వెల్లుల్లి - ఒక పాయలో 5 రెబ్బలు

 చేసే విధానం:

ముందుగా నాలుగు పప్పులూ విడి,విడిగా కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి.తరువాత జీలకర్ర కూడా వేయించాలి. కొద్దిగా చల్లారనిచ్చి, అన్నిపప్పులూ,జీలకర్రా,ఉప్పు,పసుపు,కారం,కావలసినవారు వెల్లుల్లి పచ్చివి వేసి కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.  ఘాటు పోకుండా సీసాలో వేసి మూతపెట్టాలి.

Monday, August 3, 2015

పులిహోర (pulihora)

పులి హోర ఇంట్లో ప్రతి రెండు రోజులకొకసారి చేసి బాబాగారికి నైవేద్యం పెట్టి అందరికీ ఫలహారంగా ఇస్తాము. తెలిసిన వంటకం అయినా నేను చేసే రుచి ఎలా ఉంటుందో చూద్దామా!

కావలసినవి: అరకేజీ పులి హోరకి...

వేరుశనగ గుళ్ళు - 3 చెంచాలు

శనగపప్పు    -  2 చెంచాలు

మినప్పప్పు     - 2 చెంచాలు

ఆవాలు   -- 1 చెంచా

ఇంగువ  - సరిపడా

ఎండుమిర్చి  - 6

పచ్చిమిర్చి  - 8

కరివేపాకు - గుప్పెడు ఆకులు

 చింతపండు - 50 గ్రాములు(ఒకచిన్నగ్లాసు నీళ్ళు పోసి నానబెట్టాలి.)

బియ్యం - అరకేజీ (అన్నం వండాలి.)

 పసుపు - అర స్పూను

 ఉప్పు - రెండు స్పూన్లు

నూనె -- 4 టేబుల్ స్పూన్లు,మరియు నెయ్యి ఒక టేబుల్ స్పూను

 ఆవ పెట్టి చేస్టే ఇంకా బాగుంటుంది. ఆవపెట్టాలంటే...

ఆవపిండి - ఒక స్పూను, అరచెంచా కారం, పావుచెంచా నూనె, కొద్దిగానీరు కలిపి పేస్టులా చేసి పక్కన ఉంచాలి.


ఛేయు విధానం :        బాండీలో నూనె,నెయ్యి వేసి కాగాక వేరుశనగ గుళ్ళు,పోపుసామాన్లు అన్నీ వేసి ఇంగువ వేసి,దూసిన కరివేపాకు,గాట్లు పెట్టిన పచ్చిమిర్చి,పసుపు వేసి వేగుతుండగా చింతపండు గుజ్జు తీసి పోపులోవేసి కలపాలి.ఉప్పు కూడా వేసి నూనె పైకి తేలేవరకూ కలిపి దించాలి.

ముందుగా వండుకున్న అన్నం పళ్ళెంలో వేసి, ఈ పులి హోర పోపును అందులో బాగా కలిసేటట్లు కలపాలి.కలిపి ఉంచుకున్న ఆవ కూడా అప్పుడే బాగా కలపాలి. ఆవ ఘుమఘుమతో పులిహోర రెడీ!

Wednesday, April 16, 2014

ఆవడలు (దహివడ)

వేసవికాలంలో  ఆవడలు చలవచేస్తాయి. గారెలు తింటే దాహం విపరీతంగా ఉంటుంది. అందుకే నేను ప్రత్యేకంగా ఆవడలు చేస్తాను. చేసే విధానం:-

కావలసిన పదార్ధాలు:-

మినప్పప్పు - 300 గ్రా 

పెరుగు     -1 లీటరు                      

నూనె       -1/2 లీటరు

పోపుకి:- 

మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, చిటికెడు మెంతిగింజలు, రెండు కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర,ఆరు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క.

చేయు విధానం:- 

ఉదయం ఆవడలు చేసుకుంటామనగా, మినప్పప్పు రాత్రి నీళ్ళలో నానబెట్టాలి. పప్పుని శుభ్రంగా కడిగి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. సరిపడా ఉప్పు వేసి మరీ గట్టిగా కాకుండా సమంగా గ్రైండ్ చెయ్యాలి. 

పెరుగు కమ్మగా గట్టిగా ఉండాలి పెరుగులో సమంగా ఉప్పు,చిటెకడు పసుపు వేసి కలపాలి. పచ్చిమిర్చి, అల్లం సన్నగాతరిగి, కళాయిలో రెండు చెంచాల నెయ్యి వేసి కాగాక మినప్పప్పు,జీలకర్ర,ఆవాలు,మెంతులు,వెయ్యాలి. చిటపటలాడాక కరివేపాకు,పచ్చిమిర్చి,అల్లం ,కొత్తిమీర అన్నీ నేతిలో వేగి సువాసన వస్తుండగా ఆ తాలింపు పెరుగులో వేసి ఒకసారి గరిటతో కలియతిప్పి పక్కన పెట్టుకోవాలి.

కళాయిలో అరలీటరు నూనె వేసి మరిగాక, అరిటాకుమీద నిమ్మకాయంత మినప్పిండి తీసుకునీఅకుని తడిచేసి గుండ్రంగా చేత్తో వత్తి, మధ్యలో చూపుడువేలితో రంధ్రం చేసి మరిగేనూనెలో వెయ్యాలి. కొంచం దోరగా వేగాక, పక్కన గిన్నెలో చన్నీళ్ళు పెట్టుకోవాలి. వేగిన గారెలను ఈ చన్నీళ్ళలో వేసి తీసి, పెరుగులో వెయ్యాలి.అలా కాకుండా వేడి గారెలు పెరుగులో వేస్తే పెరుగు విరిగిపోతుంది.కాబట్టి ప్రతి గారెను చన్నీళ్ళలో ముంచడం మటుకు మరవకండి.

వెడల్పాటి గిన్నెలో ఆవడలు ఉంచితే గారెలు చితక్కుండా పెరుగులో నానుతాయి. ఆవడలు రుచిగా, మెత్తగా, దూదుల్లా ఉంటాయి. చేసి రుచి చూడండి.....